సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె వయసు 36 సంవత్సరాలు.
భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే అయిన G Lasya Nanditha ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివారులో ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ ప్రమాదం జరిగింది.
కారు రోడ్డు బారియర్ను ఢీకొనటంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో తీవ్రంగా గాయపడిన లాస్య నందితను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు.
Lasya Nanditha ఎవరు?
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జి. సాయన్న కుమార్తె అయిన లాస్య నందిత పదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చారు.
గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో Lasya Nanditha సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు.
తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గణేశ్ ఎన్ మీద 17,169 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి. సాయన్న మరణించన తర్వాత.. ఆయన కుమార్తె అయిన లాస్య నందితకు బీఆర్ఎస్ ఆ స్థానం నుంచి పోటీకి దింపింది.
దీనికి ముందు 2016లో హైదరాబాద్లోని కవాడిగూడ నుంచి Lasya Nandita మునిసిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2020లో మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పదవి నుంచి దిగిపోయారు.
లాస్య నందితకు బీఆర్ఎస్ నేతల నివాళి
ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
లాస్య నందిత మంచి నాయకురాలుగా ఎదుగుతున్నారని, ప్రమాదంలో ఆమె మరణించటం దిగ్భ్రాంతి కలిగించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత కె. టి. రామారావు నివాళులర్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతాపం తెలుపుతూ లాస్య నందిత తండ్రితో తనకు సాన్నిహిత్యం ఉందన్నారు.
‘‘సాయన్న గత ఏడాది ఫిబ్రవరిలో చనిపోయారు. లాస్య నందిత ఈ ఏడాది అదే నెలలో (ఫిబ్రవరిలో) చనిపోయారు. ఇది విషాదం’’ అని విచారం వ్యక్తం చేశారు.
లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం ఈస్ట్ మారేడ్పల్లి లోని స్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాస్య నందిత ఆమె కుటుంబ సభ్యులు సదాశివపేట మండలంలోని ఆరూర్ గ్రామంలో మిస్కిన్ షా బాబా దర్గాను సందర్శించుకుని గురువారం రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చారు.
సికింద్రాబాద్లోని కార్ఖానాలో గల తమ నివాసం నుంచి నందిత శుక్రవారం ఉదయం 5:10 గంటల సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయటం కోసం తన కారులో బయలుదేరారు.
ఆ సమయంలో ఎమ్యెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆమె వెంట వెళ్లలేదు. ఆమె పర్సనల్ అసిస్టెంట్ ఆకాష్ కారు నడుపుతుండగా ముందు సీట్లో లాస్య నందిత కూర్చున్నారు.
కారు శామీర్పేట్ దగ్గర ఓఆర్ఆర్ మీదకు వచ్చాక, సుల్తాన్పూర్ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొని, అదుపు తప్పి ఎడమవైపు ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టింది. ప్రమాదానికి ముందు కారు మరో వాహనాన్ని ఢీకొట్టి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
లాస్య నందిత ప్రమాద స్థలంలోనే చనిపోయినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ డాక్టర్ల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
కారు ప్రమాదంలో లాస్య నందిత మరణంపై ఆమె సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు.. నిర్లక్ష్యంగా కారు నడిపి నందిత మరణానికి కారణమయ్యారనే అభియోగంపై ఆకాష్ మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో ఆకాష్ రెండు కాళ్లకూ తీవ్ర గాయాలవటంతో ఆయనను మదీనగూడలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
ఎమ్మెల్యే తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంట లేకుండా ఎందుకు వెళ్లారని, బ్రేక్ ఫాస్ట్ కోసం బయలుదేరి ఓఆర్ఆర్ మీదకు ఎందుకు వెళ్లారని అడిగిన ప్రశ్నలకు పీఏ ఆకాష్ సమాధానం ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంపై పూర్తిగా దర్యాప్తు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.